రెండు లారీలు ఎదురెదురుగా ఢీ..

రెండు లారీలు ఎదురెదురుగా ఢీ..

క్యాబిన్​లో ఇరుక్కుపోయిన ట్యాంకర్​ డ్రైవర్


పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద నేషనల్​హైవేపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒకదాని డ్రైవర్​క్యాబిన్​లోనే ఇరుక్కుపోగా స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. ఆదివారం ఉదయం మండాలపాడు శివారులోని బ్రిడ్జిపై ఎదురెదురుగా వచ్చిన లారీ, డాంబర్​ట్యాంకర్ ఢీకొన్నాయి. ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో ట్యాంకర్​డ్రైవర్ రాజేందర్​తీవ్ర గాయాలతో క్యాబిన్​లోనే చిక్కుకుపోయాడు.

స్థానికులు తీవ్రంగా శ్రమించి అతన్ని బయటికి తీసి హాస్పిటల్ కు తరలించారు. బాధితుడు మధ్యప్రదేశ్ వాసి అని తెలిపాడు. అవతలి వైపు లారీ డ్రైవర్​ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడు. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీఎం బంజరు ఎస్సై సూరజ్ ఘటనా స్థలానికి, రెండు లారీలను పక్కకు తీయించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.